మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్ లాండ్ సుందరి సుచాత చువాంగ్ శ్రీ చరిత్ర సృష్టించారు. మిస్ వరల్డ్-2025 కిరీటాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. సుచాతా చువాంగ్ శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్ లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వాళ్లందరినీ అధిగమించి ప్రపంచ సుందరిగా నిలిచారు సుచాత చువాంగ్. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మిస్ వరల్డ్-2025 పోటీలు హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా ముగిశాయి. ఫైనల్స్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు.
అయితే ఆమె ఘనత సాధించడానికి ముందు ఎన్నో కష్టాలను అనుభవించారు. 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డారు. రొమ్ములో కణతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. క్యాన్సర్ బారిన పడ్డట్లుగా భావించి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆమె మరణం అంచు వరకూ వెళ్లి ఎట్టకేలకు కోలుకుంది. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన, మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సుచాత చువాంగ్. ఆమె అందాల పోటీల్లోకి రావడానికి ఇవే ప్రేరేపించాయని ఆమె అన్నారు.

ఇక సుచతా చువాంగ్ పూర్తి పేరు ఒపాల్ సుచతా చువాంగ్ శ్రీ . ఆమె 20, సెప్టెంబర్ 2003న థాయ్లాండ్ లో జన్మించారు. థానెట్, సుపాత్ర చువాంగ్ ర్సీ దంపతుల కుమార్తె సుచతా చువాంగ్. ప్రస్తుతం సుచతా చువాంగ్ థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చదువుతోంది. గతంలో మిస్ యూనివర్స్ థాయ్ లాండ్ 2024 కిరీటాన్ని ఆమె సొంతం చేసుకుంది. తాజాగా ప్రపంచ సుందరి విజేతగా సంచలనం సృష్టించారు సుచతా చువాంగ్. దీంతో మిస్ వరల్డ్ గా నిలిచిన తొలి థాయ్లాండ్ మహిళగా రికార్డ్ సృష్టించారు.

ఈ ఫైనల్ పోటీలకు సోనూ సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కరీనా జడ్జిలుగా ఉన్నారు. మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ హెడ్ గా మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఉన్నారు. ఇక మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ లో రానా దగ్గుబాటి, జయేశ్ రంజన్ కూడా ఉండటం విశేషం. ఇక సోనూసూద్ కు మిస్ వరల్డ్ హుమానిటేరియన్ అవార్డు లభించింది. ఈ అవార్డును టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోనూసూద్ కు అందించారు.